మొన్నటివరకు ప్రమోషన్స్కు దూరంగా ఉన్న నయనతార… మొదటిసారి “శంకర్ వరప్రసాద్” కోసం బయటకు వచ్చారు. ఇప్పుడు “టాక్సిక్” కోసం గేరు మార్చారు.
ఈ మార్పుకు కారణం ఏమిటి? నయనతారే మారారా? లేక పరిస్థితులే ఆమెను మార్చాయా? నిజానికి రెండింటి కలయికే అనిపిస్తోంది.
నయనతార స్టార్డమ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. లేడీ సూపర్స్టార్గా ఆమెకు ఉన్న ఇమేజ్ కారణంగా… ఆమె సినిమా గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదనే భావన ఒక దశలో ఏర్పడింది. ఆమె పేరు పోస్టర్పై ఉంటే చాలు అనే స్థాయికి ఆమె మార్కెట్ వెళ్లింది.కానీ ఇప్పుడు సినిమా వ్యాపారం పూర్తిగా మారిపోయింది.ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగించాలి. సోషల్ మీడియా, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్, ప్రమోషనల్ కంటెంట్… ఇవన్నీ సినిమాకు చాలా కీలకంగా మారాయి.
ఇలాంటి సమయంలో ప్రధాన నటీనటులు కూడా ప్రచారంలో భాగం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.మరోవైపు నయనతార కూడా ఇప్పుడు తన కెరీర్లో మరో దశలోకి అడుగుపెట్టారు. ఒకప్పుడు హీరోయిన్గా మాత్రమే చూసిన ప్రేక్షకులు… ఇప్పుడు ఆమెను ఒక బ్రాండ్గా చూస్తున్నారు. అలాంటి బ్రాండ్ ప్రేక్షకులతో నేరుగా మాట్లాడితే సినిమాకు మరింత ఉపయోగం ఉంటుంది.
అందుకే “శంకర్ వరప్రసాద్” కోసం ఆమె బయటకు రావడం… ఇప్పుడు “టాక్సిక్” కోసం ప్రచారంలో చురుకుగా పాల్గొనడం… ఒక మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.
అయితే దీనిని పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయంగా చూడలేం.ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడు కేవలం థియేటర్లోకి వచ్చి ప్రేక్షకుడిని కలిసే వ్యవహారం కాదు. సినిమా మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు ప్రేక్షకుడితో ఒక నిరంతర సంబంధాన్ని కొనసాగించాల్సిన ఓ సుదీర్ఘ ప్రక్రియ.ఆ సంబంధంలో హీరో ఎంత ముఖ్యమో… హీరోయిన్ కూడా అంతే ముఖ్యం.ఆమె తెరపై కనిపించడమే కాదు,తెర బయట కూడా ప్రేక్షకుడితో కలిసి నడవాల్సిన సమయం వచ్చింది.
అందుకే ఇది నయనతారలో వచ్చిన మార్పు మాత్రమే కాదు…కాలానికి తగ్గట్టుగా ఒక స్టార్ హీరోయిన్ తనను తాను మార్చుకుంటున్న తీరుగా మనం చూడాలి.

