టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మానిటి.ఇన్’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా, తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని IMAX8K ఫార్మాట్లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్మాట్ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. టెక్నాలజీ పరంగా రాజీ పడకుండా, ప్రతి ఫ్రేమ్ను ఒక విజువల్ పోయెట్రీలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం (Humanity) విఫలమైనప్పుడు ‘మానిటీ’ (MANITY) ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్తో ఈ కథ సాగుతుందని వివరించారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండు అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. అందులోని ఓ పోస్టర్లో “When humanity is neglected… Manity arises” అనే ట్యాగ్లైన్ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా రివీల్ చేస్తోంది.
సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఏ విధంగా స్పందిస్తుందనే అంశాన్ని సైన్స్ ఫిక్షన్, సోషల్ ఎలిమెంట్స్ కలగలిపి అద్భుతంగా రాసుకున్నట్లు తెలిపారు. ఈ పాయింట్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయడమే కాకుండా, సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని ఆయన వెల్లడించారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి సైతం ఐమాక్స్ ఫార్మాట్లో సినిమా చేయడానికి ఎంతో సమయం తీసుకున్నారని, తాను తన మొదటి సినిమాతోనే IMAX 8K ప్రమాణాలను అందుకోవాలని గట్టి సంకల్పంతో ఉన్నానని బీఎస్ రావు ధీమా వ్యక్తం చేశారు. పోస్టర్ పై కనిపిస్తున్న “IMAX 8k never before” అనే పదం ఈ చిత్ర సాంకేతిక నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. మనిషి సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని, తనకున్న టెక్నికల్ నాలెడ్జ్తో హాలీవుడ్ స్థాయి అవుట్పుట్ను టాలీవుడ్ హీరోలతో సాధ్యం చేసి చూపిస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, తెరపై కనిపిస్తుందని ఆయన గర్వంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించినట్లు దర్శకుడు తెలిపారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఎవరైనా ఈజీగా సెట్ అయ్యేలా కథను సిద్ధం చేశానని, స్టార్ హీరోల డేట్స్ కుదిరితే ఈ పాటికి సినిమా ప్రారంభమయ్యేదని బీఎస్ రావు పేర్కొన్నారు!!

