HomeNewsFNCC-పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్’ (FNCC-PGBL)

FNCC-పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్’ (FNCC-PGBL)

- Advertisment -

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC), దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీతో కలిసి నిర్వహించిన ‘FNCC-పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్’ (FNCC-PGBL) క్రీడాకారుల్లో మంచి జోష్ నింపింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక లీగ్ ప్రతి శని, ఆదివారాల్లో ఫిలింనగర్ క్లబ్ వేదికగా వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్-10 పురుష, మహిళా క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. టాలీవుడ్ ప్రముఖులు, క్రీడా దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ టోర్నీ బ్యాడ్మింటన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడగా, ప్రతి జట్టు 10 లక్షల రూపాయల ఎంట్రీ ఫీజుతో బరిలోకి దిగాయి. ఈ లీగ్‌లో గెలిచిన వాళ్లకు మంగళవారం సాయంత్రం ఎఫ్ఎన్‌సీసీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, కార్యదర్శి తుమ్మల రంగారావు , ఉపాధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి ,ఉప కార్యదర్శి కె .సదాశివ రెడ్డి , కోశాధికారి శైలజ జుజాల కమిటీ సభ్యులు ఏడిద రాజా , కృష్ణం రాజు (వేణు) , వరప్రసాదం రావు , స్పోర్ట్స్ కన్వీనర్ కోగంటి భవాని , FNCC మాజీ ఉపాధ్యక్షులు మరియు బాడ్మింటన్ చైర్మన్ పురుషోత్తమ రావు ,తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ కీలక పాత్ర పోషించారు. పుల్లెల గోపీచంద్, నిఖత్ జరీన్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ..‘‘గోపీచంద్, చాముండేశ్వరీనాథ్ ఇద్దరు చేసిన కృషి చాలా గొప్పది. ఎఫ్ఎన్‌సీసీ గత ఉపాధ్యక్షుడు మరియు బాడ్మింటన్ చైర్మన్ పురుషోత్తం ఈ లీగ్ సాధ్యమయ్యేలా చేశారు. కాజా సూర్యనారాయణరావు గారికి ప్రత్యేక కృతజ్జతలు. టీమ్ ఓనర్స్ నాలుగు టీములను అరేంజ్ చేశారు. రవిగారు, వాయుపుత్ర సోమరాజు గారు, గోవర్ధన్ రెడ్డి గారు అండ్ ఫ్రెండ్స్. అలాగే ఎఫ్ఎన్‌సీసీ కూడా ఒక టీమ్ తీసుకుంది. అయితే భవిష్యత్తులో నాలుగు కాదు..ఆరు నుంచి పది టీముల దాకా ఉండే స్కోప్ ఉంది. ఈ మేరకు గోపీచంద్ గారికి రిక్వెస్ట్ చేశాం. నెక్ట్స్ టోర్నమెంట్‌ను లైవ్ టెలీకాస్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. చానల్స్ వాళ్లు కూడా దీనికి టైమ్ కేటాయించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. మా ఎఫ్ఎన్‌సీసీ టీమ్ మొత్తం దీని కోసం బాగా సహకరించారు. మ్యాగ్జిమం మా బెస్ట్ చేయడానికి ప్రయత్నించాం. ఎఫ్ఎన్‌సీసీ తరపున ప్రెసిడెంట్‌గా అందరికీ కృతజ్జతలు చెబుతున్నా. చిన్న పిల్లలు ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. నెక్ట్స్ ఇయర్ దీన్ని ఇంకా బాగా చేస్తామని ప్రామిస్ చేస్తున్నా.’’ అన్నారు.

FNCC మాజీ ఉపాధ్యక్షులు ,బాడ్మింటన్ చైర్మన్ మరియు బాడ్మింటన్ లీగ్ స్పాన్సరర్ పురుషోత్తమరావు మాట్లాడుతూ..‘‘ఈ ఈవెంట్‌ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దీన్ని నేను ఇన్షియేట్ చేసినా.. దానికి నాకు సహకరించిన చాముండేశ్వరనాథ్, గోపీచంద్, సోమరాజు వీళ్ల సహకారం వల్లే సక్సెస్ అయింది. నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని. హైదరాబాద్ వచ్చాక షటిల్ ఆడడం మొదలు పెట్టా. ఇప్పటికీ ఆడుతుంటా. ఆ ఇన్ఫ్లుయెన్స్‌తో మా కమిటీ సహకారంతో చాలా బాగా జరిగింది. అలాగే నెక్ట్స్ ఇయర్ కూడా చేయాలని అనుకుంటున్నాం. ఎఫ్ఎన్‌సీసీ క్లబ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నేను వైస్ ప్రెసిడెంట్‌గా కూడా చేశాను. స్పాన్సరింగ్ ఎవరైనా చేస్తారు.. కానీ నేను ఇన్షియేట్ చేసి ఫిల్మ్ నగర్ క్లబ్ ఖ్యాతిని నేషనల్ లెవెల్‌లో నిలపాలన్నది నా కోరిక.’’ అని తెలిపారు.

ఐవీ సోమరాజు మాట్లాడుతూ..‘‘కేఎస్ రామారావు గారు 1997లోనే ఇలాంటి కార్యక్రమం చేశారు. అప్పట్లోనే గోపీచంద్ గారితో మాకు మంచి రిలేషన్ ఉంది. నేను ఆయన మీద బెట్ వేసేవాడిని. ఫిల్మ్ నగర్ కమిటీ రిక్వెస్ట్ చేస్తే ప్రతి సంవత్సరం నలుగురినో, ఐదుగురినో గోపీచంద్ గారి అకాడమీలో అడ్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నా.’’ అని రిక్వెస్ట్ చేశారు.

పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ..‘‘మా అసోసియేషన్‌కు ఎప్పుడూ ఎఫ్ఎన్‌సీసీ సపోర్ట్ చేస్తుంది. ఇంతకు ముందు జాయింట్‌గా టోర్నమెంట్స్ చేసేవాళ్లం. ఇప్పుడు చాముండేశ్వరీనాథ్ కాల్ చేసి నేషనల్ లెవెల్ లీగ్‌గా చేద్దామన్నారు. అయితే ఇక్కడ కోర్ట్స్ తక్కువగా ఉండడం వల్ల టోర్నమెంట్స్ కండక్ట్ చేయలేకపోయాం. చాముండేశ్వరీనాథ్ గారు అడిగిన వెంటనే రెండు రోజుల్లో టీమ్స్ రెడీ చేశాం. తక్కువ టైమ్‌లో చాలా మంచిగా ఈవెంట్ జరిగింది. ఈ క్రెడిట్ ఎఫ్ఎన్‌సీసీదే. ఐపీఎల్, ఈపీఎల్ కాకుండా ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి. ఎక్కడో మెస్సీ ఆడితే చూసి సంబరం పడడం కాదు. మన దగ్గర మన పిల్లలను చూసుకుని ఆనందించాలి. మనవాళ్లు ఆడేది మనం చూసి మురిసిపోవాలి. ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని జరగాలి. ఫిల్మ్ నగర్ క్లబ్‌కు చాలా పెద్ద థ్యాంక్స్. పిల్లలు ఇంకా ఎక్కువ మంది రావాలి. డొమెస్టిక్ మ్యాచ్‌లను చూసే ఛాన్స్ నాకు కల్పించారు. చాముండేశ్వరీనాథ్ ఎప్పుడూ మాకు సపోర్ట్‌గా ఉంటారు. నిఖత్ జరీన్ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఉయ్యూరులో 13 ఏళ్ల అప్పుడు మ్యాచ్ ఆడుతుంటే చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్లు. అలాంటి ఎంకరేజ్ ప్లేయర్స్ అందరికీ ఉండాలి. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నా.’’ అన్నారు.

చాముండేశ్వరీనాథ్ మాట్లాడుతూ..‘‘కేఎస్ రామారావు గారు చాలా తక్కువకు టీమ్స్‌ను ఇచ్చారు. నెక్ట్స్ ఇయర్ ఎవరైనా ఆడాలంటే ఒక్క టీమ్‌కు 25 లక్షలు ఇవ్వాలి. నెక్ట్స్ టైమ్ గోపీచంద్ సహకారంతో టీమ్స్‌ను మేమే సెలెక్ట్ చేస్తాం.’’ అన్నారు.

చీఫ్ గెస్ట్ నిఖత్ జరీన్ మాట్లాడుతూ..‘‘ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎఫ్ఎన్‌సీసీకి థ్యాంక్స్. విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్. నేను బ్యాడ్మింటన్‌ను లైవ్‌లో చూడడం ఇదే మొదటి సారి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతోబాగా ఆడుతున్నారు. ఇక్కడ బాక్సింగ్ కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది. తెలంగాణలో బాక్సర్స్ కూడా ఉన్నారు. నెక్ట్స్ ఇయర్ బాక్సింగ్ కూడా కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నా. గోపీచంద్, చాముండేశ్వరీనాథ్ గారికి థ్యాంక్స్.’’ అని చెప్పారు.

కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ..‘‘ఏదైనా ఆర్గనైజేషన్ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలంటే అక్కడ మంచి కమిటీ ఉండాలి. ఇక్కడ అలాంటి మంచి కమిటీ ఉంది. దానికి కారణం చైర్మన్ కేఎస్ రామారావు గారు. మేము ఇప్పటి వరకు కల్చరల్ యాక్టివిటీస్ బాగా చేస్తాం. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తామనే నమ్మకం వచ్చింది. స్పాన్సర్ పురుషుత్తమరావు గారు ముందుకు రావడం వల్లే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో మరింత బాగా చేస్తామని చెబుతున్నాం’’ అన్నారు.

ఈ బ్యాడ్మింటన్ లీగ్‌లో వాయుపుత్ర టైగర్స్ టీమ్ ఛాంపియన్‌గా నిలవగా ఎలిగెన్స్ ఈగల్ టీమ్ రన్నరప్‌గా నిలిచింది. పోరూస్ పాంథర్స్ మూడో స్థానంలో నిలవగా.. ఎఫ్ఎన్‌సీసీ లయన్స్ నాలుగో స్థానంలో నిలిచింది. విన్నర్స్‌కు ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కోశాధికారి శైలజ వ్యాఖ్యాత వ్యవహరించిన ఈ కార్యక్రమంఎంతో రసవత్తరంగా జరిగింది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments