ఇటీవల సినిమా ఈవెంట్స్, ఇతర వేదికలపై చిత్ర పరిశ్రమలో సమస్యల్లో ఉన్నాం, ఇబ్బందులు పడుతున్నాం అంటూ ఫిలింమేకర్స్ చెప్పడం చూస్తున్నాం. ఇలా టాలీవుడ్ లోని కొందరు ప్రతిసారీ చేస్తున్న వ్యాఖ్యలపై దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి స్పందించారు. సినిమా అనేది అద్భుతమైన మీడియం అని, దాన్ని బాధల వేదికగా మార్చొద్దని ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఏ రంగంలో అడుగుపెట్టాలన్నా కష్టాలు, ఒత్తిడులు, లాభనష్టాలు ముందే అంచనా వేసుకుని, అర్థం చేసుకుని వస్తారని, సినిమా ఇండస్ట్రీ కూడా అంతేనని మధుర శ్రీధర్ రెడ్డి తన పోస్ట్ లో పేర్కొన్నారు. మంచి చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని ఆయన అన్నారు.
దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ – బిజినెస్లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజం. వాటిని ముందే అర్థం చేసుకుని రంగంలోకి వస్తారు… సినిమా కూడా అంతే. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకండి. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారి మైకు ముందు వచ్చి “సమస్యలు… సమస్యలు…” అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది… ! ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు… భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు. సినిమా ఒక బిజినెస్… ఛారిటీ కాదు! . సిన్సియర్గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి… వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి. ఒక సినిమాలో నష్టం వస్తే… ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి. మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమా ప్రాజెక్ట్పై రుద్దకండి. నిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు. సిన్సియర్గా సినిమాలు తీయండి… ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుంది. అన్నారు.

