సహజనటి జయసుధ
హీరోయిన్ గా “లక్ష్మణరేఖ”
గీసుకుని 50 సంవత్సరాలు!!
12 – 09 – 1975లో
విడుదలై జయసుధ కెరీర్ కి
తిరుగులేని పునాది వేసిన
ఎన్. గోపాలకృష్ణ “లక్ష్మణరేఖ”
ఆనంతరకాలంలో తనదైన అభినయంతో “సహజనటి” బిరుదాంకితురాలైన జయసుధ హీరోయిన్ గా పరిచయమైన చిత్రం “లక్ష్మణరేఖ”. యాభై ఏళ్ళ క్రితం… సెప్టెంబర్ 12, 1975లో విడుదలైన ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన గోపాలకృష్ణ ఇంటిపేరు “లక్ష్మణరేఖ”గా మారిపోయింది. అప్పటి రోజులకు విప్లవాత్మకం అనదగ్గ వినూత్న కధాంశంతో తెరకెక్కిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో మురళీమోహన్ – జయసుధ జంటగా నటించగా… చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ కలిగిన ముఖ్య పాత్ర పోషించగా… గుమ్మడి, అల్లు రామలింగయ్య ప్రభృతులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అప్పటి సంగీత సంచలనం సత్యం సంగీత సారధ్యం వహించారు. ఎ. వి. కె. ప్రొడక్షన్స్ పతాకంపై షణ్ముగం చెట్టియార్ – కృష్ణారావు సంయుక్తంగా నిర్మించారు!!
ఈ చిత్రం విడుదలై 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా “లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ” మాట్లాడుతూ… “ఈ చిత్రం కోసం జయసుధను ఎంపిక చేయడాన్ని పలువురు పెద్దలు ఓపెన్ గానే క్రిటిసైజ్ చేశారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా… అందునా కొత్త దర్శకుడితో చేస్తూ… లేనిపోని రిస్క్ చేస్తున్నారని నిర్మాతల్ని భయపెట్టారు కూడా. కానీ నా మీద, నా సబ్జెక్ట్ మీద నమ్మకంతో నా నిర్మాతలు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. వాళ్ళు చేసిన రిస్క్ ఫలించి, టేబుల్ ప్రాఫిట్ గా “లక్ష్మణరేఖ” నిలిచి… నా ఇంటిపేరుగా మారిపోయింది. ఏరియాల వారిగా బిజినెస్ జరుపుకున్న మొట్టమొదటి చిత్రంగానూ దర్శకుడిగా నా పరిచయ చిత్రం చరిత్ర సృష్టించడం పట్ల నేను ఇప్పటికీ గర్వపడుతుంటాను” అన్నారు
