యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ విశాల్ సేవాభావం, ఆయన చేసే సమాజ సేవ గురించి అందరికీ తెలిసిందే. పేద విద్యార్థులు, అనాథల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఆయన సేవా సంస్థలు, ట్రస్ట్ల ద్వారా ఎంతో మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంటారు. ఈ క్రమంలో విశాల్ ఆధ్వర్యంలోని దేవి సోషల్, ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ మద్దతుతో 10 మంది విద్యార్థులు రీసెంట్గా పట్టభద్రులయ్యారు. సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 35వ స్నాతకోత్సవంలో ఈ విద్యార్థులంతా పట్టభద్రులయ్యారు. అంతే కాకుండా దీపిక బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA)లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు
ఈ మేరకు విశాల్ తన సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘ఈ యంగ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ తమ కలలను సాకారం చేసుకోవడం, వారిని ఇలా చూస్తుండటం నాకెంతో సంతోషంగా ఉంది. దీపికకు ప్రత్యేక అభినందనలు. దీపిక మా అందరినీ ఎంతో గర్వపడేలా చేశావు. ఎంతో గర్వపడేలా చేశావు. బన్రుతికి చెందిన ఒక రైతు కుటుంబం నుంచి దీపిక ఈ స్థాయి వరకు వచ్చారు. మా విద్యార్థుల విద్యా ప్రయాణంలో వారికి మద్దతుగా నిలిచినందుకు సత్యభామకు చెందిన శ్రీమతి మరియా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం ఎన్నో జీవితాలను మార్చడంలో సహాయపడ్డాయి.
విద్యార్థులందరినీ ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు ఎప్పుడూ గొప్ప కలలు కంటూ ఉండాలి, నమ్మకంతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. అందరినీ గర్వపడేలా చేస్తూ ఉండాలి. ఇది ఆరంభం మాత్రమే’ అని విశాల్ అన్నారు. అంతేకాకుండా 2017లో అన్బు ఫౌండేషన్ ద్వారా కేవలం నలుగురు స్టూడెంట్స్తో సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కాలర్ షిప్ ప్రోగ్రాంను ప్రారంభిన రోజుల్ని విశాల్ గుర్తు చేసుకున్నారు. నలుగురితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నేడు ఎంతో మంది స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన తీరుని విశాల్ గుర్తు చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
త్వరలోనే విశాల్ ఆడియెన్స్ ముందుకు ‘మకుటం’ అంటూ రాబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘మకుటం’ కంటెంట్ అందరిలోనూ హైప్ను పెంచిన సంగతి తెలిసిందే.

