పాకిస్థాన్ పాశవిక చర్యలకు ప్రతిచర్యగా మోదీ ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”పై అశేష భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. వీరోచిత పోరాటం చేస్తున్న త్రివిధ బలగాలకు హ్యాట్సాప్ చెబుతోంది. మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొడుతూ విధ్వంస రచన చేస్తున్న పాక్ కు సరైన గుణపాఠం చెప్పాలన్న ప్రజాగ్రహానికి అనుగుణంగా… భవిష్యత్తులో ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడే దుస్సాహసానికి పాక్ తెగబడకుండా భారత్ చేస్తున్న వ్యూహాత్మక దాడులకు భారత్ లోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఉగ్రమూకల శిబిరాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడి యుద్ధంగా పరిణామం చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాక్ పైనే ఉంది. పౌరుల ప్రాణాలు పణంగా పెట్టి సంయమనం పాటించడానికి భారత్ సిద్ధంగా ఉండాలని బుర్రలో గుజ్జున్నవారు ఎవరూ కోరుకోరు. భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”కు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తోంది. “మేము కాదు నిజమైన హీరోలు మీరే” అంటూ వారి సాహసానికి సలాం చేస్తోంది. తమ దేశ ప్రజలను పక్క దోవ పట్టించడానికి పాక్ పాలకులు చేస్తున్న దుష్ట పన్నాగాలు యావత్ ప్రపంచం నిశితంగా పరిశీలిస్తున్న దృష్ట్యా… ఇప్పుడు కమ్ముకున్న యుద్ధ మేఘాలు భారీ నష్టాల వర్షాలు కురిసేలా చేయకుండా… పాకిస్థాన్ విజ్ఞతతో వ్యవరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం!!
