72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మా ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం (Best Telugu Film)తో పాటు ఉత్తమ మేకప్ (Best Makeup) విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు లభించడం పట్ల నిర్మాత ఫణి అడపాక హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “‘సిద్ధార్థ్ రాయ్’ సినిమాతో నిర్మాతగా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. తొలి సినిమాతో ఎంతో విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాను. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో కలిసి ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి మంచి కథ, బలమైన భావోద్వేగాలు కలిగిన చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ రోజు అదే చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డులు అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోంది. ఒక నిర్మాతగా ఇది నాకు ఎంతో గర్వకారణమైన క్షణం. మా చిత్రాన్ని ఇంత గొప్ప స్థాయిలో గుర్తించి జాతీయ స్థాయిలో సత్కరించడం మొత్తం టీమ్ కష్టానికి దక్కిన గొప్ప గుర్తింపు.
ఈ విజయంలో భాగమైన దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి విభాగంలో అంకితభావంతో పనిచేసిన యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ ప్రయాణంలో నాతో కలిసి నిలిచిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా, విడుదలైన రోజు నుంచి ఈ చిత్రాన్ని తమ సొంత సినిమాలా ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే ఈ అవార్డులకు అసలు బలం. ఈ విజయం వారందరికీ అంకితం.
ప్రస్తుతం ETV Winతో కలిసి మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులను రూపొందిస్తున్నాం. థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటీటీ వేదికల కోసం కూడా నాణ్యమైన, వినూత్నమైన కథలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
ఈ జాతీయ అవార్డులు మాపై మరింత బాధ్యతను పెంచాయి. భవిష్యత్తులోనూ మంచి కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించే సినిమాలు, వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ, తెలుగు సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తామని” నిర్మాత ఫణి అడపాక తెలిపారు.

