వ్యర్థాల రీసైక్లింగ్ నుంచి బయో ఎనర్జీ వరకు ఆధునిక సాంకేతికతల ప్రదర్శన
వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, వనరుల సమర్థ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న 3వ ఎకో సస్టెయిన్ ఎక్స్పో & కాన్ఫరెన్స్ మరియు 5వ ఐపీఈసీ ఎక్స్పో & కాన్ఫరెన్స్ గురువారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శన ఆగస్టు 1 వరకు కొనసాగనుంది.
తెలంగాణ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎంఎస్ఎంఈ) కె. మధుకర్ బాబు, ఏస్ అర్బన్ గ్రూప్ & ఏఎం గ్రీన్ డైరెక్టర్ స్వాతి చలమలశెట్టి, ఐఈడీఎస్ & జాయింట్ డైరెక్టర్ (హెచ్ఓఓ) సి.ఎస్.ఎస్. రావు, రిచ్ తెలంగాణ సీఈఓ రష్మి పింపాలే, సీఐపీఈటీ హైదరాబాద్ ప్రిన్సిపల్ డైరెక్టర్ బి. రవి, ఎఫ్ఎస్ఎంఈ జాతీయ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి అరాణి సంయుక్తంగా ఎక్స్పోను ప్రారంభించారు.
ఎక్స్పోలో 140కు పైగా సంస్థలు పాల్గొని వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి, బయో ఎనర్జీ, వాయు కాలుష్య నియంత్రణ, సుస్థిర పారిశ్రామిక సాంకేతికతలకు సంబంధించిన ఆధునిక ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 30కి పైగా నగరాల నుంచి 12 వేలకుపైగా వ్యాపార ప్రతినిధులు, సందర్శకులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మధుకర్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో నేటి తెలంగాణ ప్రభుత్వం ఎం ఎస్ ఎం ఈ లకు సంబంధించి తీసుకున్న పాలసీలను అమలు చేస్తూ వస్తుంది నేటికీ పర్యావరణం సంబంధించి అవి కేంద్రీకృతం అవుతున్నాయి, వీటి అభివృద్ధికి తెలంగాణ గవర్నమెంట్ క్యూర్, ప్యూర్ అండ్ రేర్ రీజియన్స్ పై అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
ప్రదర్శనలో భాగంగా గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రీ 5.0, ఈఎస్జీ, వాతావరణ మార్పులకు అనుగుణత, వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై సదస్సులు, ప్యానెల్ చర్చలు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పరిశుభ్రమైన సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించడం, పరిశ్రమలు–ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, సుస్థిర పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడమే ఈ ఎక్స్పో ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.

