
రాజమహేంద్రవరం, డిసెంబర్ 21 : చరిత్రలో జరిగిన యధార్ధ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘చాంపియన్’ చిత్రం ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని హీరో రోషన్ వెల్లడించారు. చాంపియన్ చిత్ర ప్రమోషన్లో భాగం రాజమహేంద్రవరం విచ్చేసిన హీరో రోషన్, హీరోయిన్ అనశ్వర రాజన్ లు స్థానిక ప్రసాదిత్య మాల్ లో అదివారం సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రోషన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం 1948 లో బైరాన్ పల్లె అనే గ్రామంలో జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన చోటు చేసుకుందని, ఆయదార్ధ సంఘటన ఆధారంగా చాంపియన్ చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారని తెలిపారు. పుట్ బాల్ క్రీడ బ్రాక్ డ్రాప్ లో, యాక్షన్, అద్భుతమైన రొమాంటిక్ లవ్ స్టోరీతో చాంపియన్ ప్రేక్షకులను అలరిస్తాడని అన్నారు. మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారన్నారు. ఇప్పటికే విడుదలైన పాట ఎంతగానో ఆకట్టుకుందన్నారు. కొరియోగ్రాఫర్ లు మంచి నృత్యరీతులు సమకూర్చారని తెలిపారు. వైజయంతి వంటి పెద్ద బ్యానర్ లో ఇంత పెద్ద సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ కు మంచి హైప్ వచ్చిందని సినిమా అంతకు మించి ఉంటుందన్నారు. హీరోయిన్ అనశ్వర రాజన్ అధ్భుతంగా నటించిందని, ఈ చిత్రం తర్వాత తనకు తెలుగులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. పెళ్ళి సందడి తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నానని తెలిపారు. కధ ఎంపిక నుండి అన్ని విషయాలలో తన తండ్రి శ్రీకాంత్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. ట్రైలర్ రిలీజ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం ఆనందంగా ఉందన్నారు. మరో రెండు చిత్రాలు ఒకే అయ్యాయని, ఛాంపియన్ విడుదల తర్వాత వాటి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. హీరోయిన్ అనశ్వర రాజన్ మాట్లాడుతూ తెలుగులో తన తొలి చిత్రమే వైజయంతివంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో పనిచేయడం తన అదృష్టం అన్నారు. ఛాంపియన్ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అభిమానులతో ఫొటోలు దిగారు.హీరో, హీరోయిన్ లకు గీతా ఫిలింస్ డిస్టిబ్యూటర్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు.

