- పర్యాటక భవన్ లో బెలూన్ ఎగురవేత
హైదరాబాద్, డిసెంబర్ 11:
తెలంగాణ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (HISFF) తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఫెస్టివల్ కు సంబధించిన ప్రమోషన్ ఈవెంట్స్ మొదలుపెట్టారు. ఈ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ను బుధవారం సాయంత్రం టూరిజం ప్లాజాలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక కలసి ఆవిష్కరించారు. టూరిజం భవనం పై ప్రచార బెలున్ లను కూడా ఎగురవేశారు. ఏడువందల పైగా వివిధ దేశాల నుంచి సైతం వచ్చిన సినిమాల ప్రోమోను ప్రదర్శించారు.

ఈ సందర్బంగా టూరిజం డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ
హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ వేదికగా ఎదిగిందని, యూరప్ , అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని చెప్పారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి 700 కి పైగా చిత్రాలు రావడం హర్షించదగిన విషయమని అన్నారు. నూతనంగా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే యువతీ యువకులకు ఇదొక గొప్ప వేదిక అవుతుందనని ఆమె అన్నారు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బృందాన్ని అభినందించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి వారు చేసిన అవిశ్రాంత కృషిని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్లో అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందినిసిన ప్రసాద్స్ ఐమాక్స్లో ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రదర్శనకు అధికారికంగా ఎంపికైన 60 మంది చిత్రనిర్మాతలందరికీ ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అధినేత, అంకురం దర్శకుడు ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించి వదిలేయడం కాకుండా , తరువాత కూడా సినిమాలు పంపిన యువతతో, సినిమాలు చూసిన యువతతో ఒక అవగాహన సదస్సు నిర్వహిచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దీని ద్వారా సినిమాపట్ల ఆసక్తిగా ఉన్నారు అనేక అంశాలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. డిసెంబర్ 19,20,21 తేదిల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీ సీ డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

