రూపేష్
ప్రస్తుతం ఉన్న తరుణంలో ఓ ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ కథా చిత్రాలు, విలువలను చాటి చెప్పే కథల్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ సందేశాత్మక చిత్రంగా ‘షష్టిపూర్తి’ సినిమాను రూపేశ్ నిర్మించారు. నిర్మాతగానే కాకుండా హీరోగానూ నటించారు. డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని పవన్ ప్రభ తెరకెక్కించారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హీరో, నిర్మాత రూపేశ్ మంగళవారం (మే 27) నాడు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన విశేషాలివే..

- ‘షష్టిపూర్తి’ కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం ఇలాంటి కథలే రావడం లేదు. హింసతో కూడిన చిత్రాలే వస్తున్నాయి. ఇలాంటి విలువలతో స్క్రిప్ట్ నా వద్దకు రావడంతో ఎంతో ఆనందించాను. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానే ఉన్నా.. నటించడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ‘షష్టిపూర్తి’ పూర్తిగా కల్పిత చిత్రమే. కానీ ఇందులోని పాత్రల్ని చూస్తే ఆడియెన్స్ మాత్రం తమని తాము చూసుకున్నట్టుగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం అసలు స్వచ్చమైన ప్రేమను కూడా చూపించడం లేదు. ఇందులో కుటుంబ అంశాలతో పాటుగా అన్ని రకాల ఎమోషన్స్ను చూపించాం.
- ‘షష్టిపూర్తి’ కథను రాజేంద్ర ప్రసాద్ గారి కోసమే పవన్ ప్రభ రాసుకున్నారు. ఆయన కొడుకుగా నటించే వారిది కొత్త మొహం అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను చూస్తారు. అందుకే కొత్త ఫేస్ కోసం దర్శకుడు చూశారు. చివరకు నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాను.
- ఇళయరాజా గారి మ్యూజిక్తో సినిమా స్థాయి పెరిగింది. ఆయన మాకు ఎంతో సహకరించారు. ప్రతీ పాటకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. బయట ప్రచారం జరిగినట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. కీరవాణి గారు అడిగిన వెంటనే పాటను రాసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్ గారి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇందులోని పాటలు, ఆర్ఆర్ ఆడియెన్స్ను కదిలిస్తాయి!!