థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల శాతం రోజురోజుకూ ప్రమాదకరంగా తగ్గిపోతూవస్తోంది. బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను సైతం… చూసే ప్రేక్షకుల శాతం మన దేశంలో కేవలం 2 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అంటే అసాధారణమైన విజయం సాధించిన “పుష్ప-2” చూసినవాళ్ళు మన దేశం మొత్తం మీద మూడు కోట్ల లోపు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ దుశ్చర్యల కారణంగా కమ్ముకున్న యుద్ధ మేఘాలు మన చిత్ర పరిశ్రమను దారుణంగా దెబ్బ తీయనున్నాయి. “ఎక్కువ సమూహాలుండే ప్రదేశాలకు వెళ్లడం ప్రమాదం” అని ప్రభుత్వమే హెచ్చరిస్తోంది. ఇది కాకుండా… ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధమే వస్తే… అది కచ్చితంగా ప్రతి కుటుంబ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి… ప్రతి ఫ్యామిలీ ప్రస్తుతానికి… తమ బడ్జెట్ నుంచి సినిమాలను నిర్ధాక్షిణ్యంగా తీసేస్తారు. వినోదం ఎలాగూ ఇళ్ళల్లోనే తిష్ట వేసుకు కూర్చుంది. హ్యాపీగా కంప్యూటర్స్ లేదా టివిలకు అతుక్కుపోతారు. కాబట్టి సినిమా రంగానికిది చాలా క్లిష్ట కాలం. ఇంతకు ముందు కూడా ఇటువంటి ఎన్నో ఉపద్రవాలను ధీటుగా తట్టుకుని, తన ఉనికిని చాటుకున్నట్లే… ఈ విపత్కర పరిస్థితిని కూడా చిత్రసీమ అధిగమిస్తుందని ఆశిద్దాం!!