తొలి తెలుగు ఎ. ఐ సినిమా ‘యమకింకరుడు’కు యు/ఏ
సెప్టెంబర్ 18న థియేటర్లతోపాటు
అన్ని ప్రధాన ఓటీటీ వేదికలలో
ఏకకాలంలో భారీ విడుదల!!
తెలుగు చిత్రసీమలో సరికొత్త ప్రయోగంగా తెరకెక్కుతున్న ‘యమకింకరుడు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెప్టెంబర్ 18 విడుదలకు సిద్ధమవుతోంది. తుమ్మలపల్లి రామసత్య నారాయణ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ జారీ చేసింది. “తెలుగు తొలి ఎ. ఐ సినిమా” అనే ప్రత్యేకతతో రూపొందుతున్న ‘యమకింకరుడు’లో ప్రముఖ నటుడు సుమన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సరికొత్త సాంకేతికత, వినూత్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా రూపకల్పన, సాంకేతికత, కథా నేపథ్యాన్ని అభినందించినట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు – కథానాయకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ… “యమకింకరుడు సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త ప్రయోగంగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఎ. ఐ సాంకేతికతను ఉపయోగించుకుని ఒక పూర్తి స్థాయి తెలుగు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఈ సినిమాను రూపొందించాం. సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమాను చూసి యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వడంతోపాటు ప్రశంసించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది మా టీమ్కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 18న అత్యధిక ధియేటర్లతోపాటు… “ఆహా, జీ5, ఈటివి విన్, అమెజాన్, సోనీ లివ్” తదితర అన్ని ప్రధాన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు తప్పకుండా కొత్త అనుభూతిని పొందుతారు” అని అన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ!!

