మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “పెద్ది” రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా సినిమా విశేషాలు పంచుకున్నారు.
-నా తొలి చిత్రం “ఉప్పెన” బ్లాక్బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు “పెద్ది”తో వస్తున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్బస్టర్ విజయం తర్వాత దర్శకుడికి ఐదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). మా గురువుగారు సుకుమార్ గారు నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. చరణ్ గారికి నచ్చింది. “ఉప్పెన” తర్వాత చరణ్ గారి దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ పూర్తయ్యింది.
-క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. “దంగల్” చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్ను తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలోని పహల్వాన్లను కూడా టీమ్లో భాగం చేశాం. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు.
ఎన్టీఆర్ గారి కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరు. ఇది పూర్తిగా చరణ్ గారి కోసం తయారు చేసిన కథ.

