ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న “వేదవ్యాస్” చిత్రం బ్యానర్ ఆవిష్కరణ ఫిలిం నగర్ లోని సాయిబాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగింది.
మాజీ శాసనసభ్యులు, కె . పి. ఆర్. ఐటీ విద్యాసంస్థల అధినేత, బిజినెస్ మ్యాన్ అయిన కొమ్మూరి ప్రతాపరెడ్డి తమ బ్యానర్ కు “సాయి ప్రగతి ఫిలిమ్స్” అని నామకరణం చేసుకొని చిత్ర దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకులు అచ్చిరెడ్డిలతో కలిసి సంప్రదాయబద్ధంగా పంచ కట్టులో దేవాలయానికి విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్యానర్ ను ఆవిష్కరించారు. తమ ఇష్టదైవమైన సాయిబాబా సమక్షంలో ఈ ముగ్గురు ప్రముఖులు పంచకట్టులో కనిపిస్తున్న ఫోటోలు వారి ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపులలో వైరల్ అవుతున్నాయి.
కాగా హైందవ ధర్మ విశిష్టతను ఆవిష్కరిస్తూ సైంటిఫిక్ అప్రోచ్ కలిగిన సకుటుంబ సమేత కథాంశంతో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వేదవ్యాస్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ “వేద వ్యాస్” చిత్రం ద్వారా కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ ను తెలుగు తెరకు పరిచయం చేయటం విశేషం.
ఇంకా ఈ చిత్రంలో సాయికుమార్, సుమన్, బాబు మోహన్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్, రఘు బాబు అజయ్ ఘోష్, ఐమాక్స్ వెంకట్, విద్యులేఖ, రాజేశ్వరి నాయర్ వంటి ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్. వి. కృష్ణారెడ్డి కథ, స్క్రీన్ ప్లే. డైలాగ్స్, సంగీతం, దర్శకత్వం అనే ఐదు ప్రధాన శాఖలను నిర్వహిస్తున్న
ఈ చిత్రానికి పాటలు: భువనచంద్ర , వెనిగళ్ళ రాంబాబు, కెమెరా : శరత్, కొరియోగ్రఫీ: సుచిత్ర , ఎడిటింగ్: చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనింగ్ : బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఫణి శ్రీనివాస రెడ్డి మేడపాటి. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సమర్పణ కె. అచ్చిరెడ్డి, నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి!!

